ఢిల్లీ, 4 అక్టోబర్ (హి.స.)పిల్లలకు దగ్గు సిరప్(Cough Syrup)ల వినియోగం విషయంలో జాగ్రత్తలు అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (డీజీ హెచ్ ఎస్) మరోసారి స్పష్టం చేసింది.
పిల్లల్లో వచ్చే ఎక్కువ శాతం దగ్గు వ్యాధులు తక్కువ కాలంలో తానే తగ్గిపోతాయని, వాటికి ప్రత్యేకంగా మందుల అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారని మంత్రిత్వ శాఖ(Union Health Ministry) గుర్తుచేసింది.
రెండు సంవత్సరాల లోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని, ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా వీటి వాడకం తగ్గించాలని అధికారులు సూచించారు. అలాంటి సందర్భాల్లో వైద్యుల పర్యవేక్షణలోనే తగిన మోతాదులు, తక్కువ వ్యవధి పాటు మాత్రమే మందులు ఇవ్వాలని, ఒకేసారి ఒక్క మందు మాత్రమే వాడాలని సలహా ఇచ్చారు. దగ్గు తగ్గించడంలో ముందుగా ప్రయత్నించాల్సినవి ఔషధేతర మార్గాలేనని – అంటే తగినంత నీరు తాగించడం, విశ్రాంతి ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడమే మొదటి ప్రాధాన్యంగా ఉండాలని సూచనల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV