కాన్పూర్, 4 అక్టోబర్ (హి.స.) భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా-ఏ క్రికెట్ జట్టులో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. జట్టు ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్న్టన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టుతో కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో వన్డే సిరీస్ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
హెన్రీ తీవ్రమైన జీర్ణకోసం ఇన్ఫెక్షన్తో బాధపడటంతో వెంటనే కాన్పూర్లోని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో రెండు రోజుల పాటు చికిత్స అందించారు. జట్టు బస చేస్తున్న హోటల్లో ఆహారం తీసుకున్న తర్వాతే ఆయనకు గ్యాస్ట్రో సమస్యలు తీవ్రమయ్యాయని జట్టు వర్గాలు తెలిపాయి.
పూర్తిగా కోలుకున్న తర్వాత థోర్న్టన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా, ఆయన తిరిగి జట్టుతో కలిశాడు. అయితే, కాన్పూర్కు రాకముందే హెన్రీలో స్వల్పంగా గ్యాస్ట్రో లక్షణాలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చాక పరిస్థితి మరింత దిగజారిందని స్థానిక మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం అప్రమత్తమైంది. థోర్న్టన్తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా స్వల్ప కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడినట్లు తెలిసింది. దీంతో యాజమాన్యం వెంటనే ఆటగాళ్లందరి డైట్ ప్లాన్లో మార్పులు చేసింది. ఆహారం, తాగునీటి విషయంలో కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV