లద్దాఖ్, ఢిల్లీ, ,05 అక్టోబర్ (హి.స.)
(Ladakh)కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ ఇటీవల లేహ్ ప్రాంతంలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లద్దాఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆయన జైలు నుంచి ఓ సందేశాన్ని పంపారు. ఘర్షణల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, లేదంటే తాను జైలులోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
వాంగ్చుక్ ప్రస్తుతం జోధ్పుర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సోదరుడు కాత్సేతాన్ డోర్జే లేతో పాటు న్యాయవాది ముస్తఫా హాజీలు ఆయన్ను కలిసిన సందర్భంగా ఈ సందేశాన్ని పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నాను. నా కోసం ప్రార్థిస్తున్న వారికి ధన్యవాదాలు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. నలుగురు వ్యక్తుల హత్యలకు సంబంధించి స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. లేదంటే నేను జైలులోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కోసం ప్రజలు, లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఏడీఏ) చేస్తున్న డిమాండ్లకు మద్దతిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి, ఐక్యతను కాపాడుకోవాలన్నారు. అహింసా మార్గంలోనే మన పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ప్రజలకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ