
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)
తెలంగాణ మట్టికవి, ప్రముఖ రచయిత అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ పెట్టారు. అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు