
వేములవాడ, 20 నవంబర్ (హి.స.)
వేములవాడ నియోజకవర్గ
వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, అలాగే నియోజకవర్గంలో నెలకొని ఉన్న ప్రధాన సమస్యల పై గురువారం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని, ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాలో ఉన్న జాప్యం పై విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా విచారణ చేశారు. మండలాల వారీగా ఉన్న సమస్యలను తహసీల్దార్లు విప్ దృష్టికి తీసుకువచ్చారు.
విప్ మాట్లాడుతూ ఇసుక సరఫరా విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు