
పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.)పుట్టపర్తి శ్రీసత్యసాయి(Puttaparthi Sathya Sai Baba) జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నింపిన శక్తి అందరిలోనూ ఉంటుందని అన్నారు. సరిగ్గా వందేళ్ల క్రితం ఈ పుణ్యభూమిపై ఒక గొప్ప లక్ష్యం కోసం సత్యసాయి బాబా అవతరించారని తెలిపారు. చిన్నతనం నుంచే ఎన్నో కోట్ల మందిని ప్రభావితం చేశారని అన్నారు. మానవరూపంలో మనం చూసిన దైవస్వరూపమే సత్యసాయి బాబా అని కొనియాడారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారని గుర్తుచేశారు.
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాదిమంది భక్తులు పయనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజాసేవకు అంకితమైన కోట్లాదిమంది భక్తులు సత్యసాయి ప్రతిరూపాలని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, తమిళనాడు మంత్రి శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు స్వర్ణ రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV