
జొహన్నెస్బర్గ్, 21 డిసెంబర్ (హి.స.)
సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జొహన్నెస్బర్గ్ శివారులోని ఓ టౌన్షిప్లో ఈరోజు ఉదయం ఓ బార్ ముందు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారు తొమ్మిది మంది చనిపోయారు. మరో పది మందికి గాయాలయ్యాయి. దుండగులు రెండు కార్లలో అక్కడికి చేరుకుని అకస్మాత్తుగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. తొలుత ఈ ఘటనలో పదిమంది చనిపోయారని ప్రకటించారు. ఆ తర్వాత మృతులు తొమ్మిది మంది అని స్పష్టత ఇచ్చారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. కాల్పులు జరిగిన ఏరియా చుట్టుపక్కల బంగారు గనులు ఉన్నాయని, అక్కడ కార్మికులే ఎక్కువగా ఉంటారని పోలీసులు వివరించారు. కాగా, ఈ నెలలో దక్షిణాఫ్రికాలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన. డిసెంబరు 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారిసహా 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV