
న్యూఢిల్లీ, 23 డిసెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై
జరుగుతున్న అమానుష దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ సమీపంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు నేడు నిరసన చేపట్టాయి. బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అక్కడి ప్రభుత్వం దాడులను అరికట్టడం లో పూర్తిగా విఫలమైందని ఆందోళనకారులు మండిపడ్డారు. హిందూ సమాజానికి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా వీహెచ్పీ కార్యకర్తలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ముందస్తుగానే భారీగా మోహరించి బారికేడ్లతో వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని వీహెచ్పీ, భజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..