
చెన్నై, /ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఇంటర్నెట్ వినియోగం నిషేధించేలా ప్రత్యేక చట్టం చేయడంపై పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి సూచించింది. అంతేగాక సోషల్ మీడియాపై అవగాహనా ప్రచారాన్ని సమర్థవంతంగా చేయాలని ఆదేశించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన లాంటి చట్టం మన దేశంలో కూడా అమలులోకి వచ్చే వరకు అందుబాటులో ఉన్న అన్ని మీడియాల ద్వారా అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్లతో కూడిన మదురై ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీల చిత్రాలు సులువుగా అందుబాటులో ఉంటున్న ఇంటర్నెట్ను చిన్నారులు వీక్షించకుండా చర్యలు చేపట్టాలంటూ విజయ్కుమార్ అనే సామాజిక సేవా కార్యకర్త దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం ఈ మేరకు సూచనలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇంటర్నెట్లో అశ్లీల చిత్రాలు పుంఖానుపుంఖాలుగా అందుబాటులో ఉంచుతున్నారని, అలాంటి చిత్రాలను ఎవరైనా సులువుగా చూసే అవకాశం ఉందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ