
ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) : బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్కు ఒక ఇన్ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ