
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో బాంగ్లాదేశ్ హై కమిషనర్ గా పనిచేస్తున్న రియాజ్ హమీదుల్లా వెనక్కి రావాలని బాంగ్లాదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో విదేశాంగ నుండి అందిన ఆదేశాల మేరకు ఆయన సోమవారం రాత్రికి రాత్రే ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ లోని కీలక వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకే ఆయన్ని పిలిపించి నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి ప్రముఖ దిన పత్రికలో ప్రచురించారు. సరిహద్దు సమస్యలు, ఇటీవల తలెత్తిన దౌత్యపరమైన వివాదాల నేపథ్యంలో, తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు