న్యూఢిల్లీ.25 మే (హి.స.) ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మన్ కి బాత్ 122వ ఎపిసోడ్లో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత మోదీ మన్కీ బాత్లో ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు. దేశ ప్రజలను ఆపరేషన్ సింధూర్ ఎంతగానో ప్రభావితం చేసిందని, అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని పేర్లు పెట్టుకున్నారని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..