
హైదరాబాద్, 27 మే (హి.స.)
ఫతేనగర్ వంతెన మెట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న వంతెన మెట్లపై నుంచి దిగుతుండగా అవి విరిగిపడి పలువురికి తీవ్ర గాయాలైన ఘటన నేపథ్యంలో కమిషనర్ మెట్ల మార్గాన్ని మంగళవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న మెట్లపై నుంచి రాకపోకలు సాగించడం సరికాదని కమిషనర్ నిర్ధారించారు. వంతెనకు ఆనుకుని ఏర్పాటు చేసిన మెట్లను పూర్తిగా తొలగించాలని హైడ్రా అధికారులను ఆదేశించారు.
అలాగే నగరంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాల విషయంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం నిపుణులతో తనిఖీ చేయించి ప్రమాదకరంగా మారక ముందే వాటిని తొలగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. కమిషనర్ ఆదేశాలతో ఫతేనగర్ వంతెనకు ఆనుకుని నిర్మించిన మెట్ల మార్గాన్ని జేసీబీతో హైడ్రా డిజాస్టర్ సిబ్బంది మెట్లను తొలగించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..