బెంగళూరు, 28 మే (హి.స.), : దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్)లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో హెచ్ 125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. తొలుత 10 యూనిట్లు, ఆ తర్వాత 20 ఏళ్లలో 500 హెలికాప్టర్ల తయారీ దిశగా దీన్ని విస్తరించనున్నాయి. కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తారు. అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకూ సరఫరా చేయనున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ స్థాపించే నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. హెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మతు, ఒప్పంద కార్యక్రమ (ఎంఆర్ఓ) కార్యకలాపాల కోసం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించనున్నారు. దీంతో పాటు ఇతర ఒప్పంద కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ