న్యూఢిల్లీ:, 30 మే (హి.స.)కెనడా (Canada) పశ్చిమాన సస్కెట్చివాన్ ప్రావిన్స్లో కార్చిచ్చు వ్యాపించడంతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే మాంటోబా ప్రావిన్స్లో దీని కారణంగా దాదాపు 17,000 మందిని ఇళ్లు ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాము తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని సస్కట్చెవాన్ ప్రావిన్స్ ప్రీమియర్ స్కాట్మో పేర్కొన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా అన్ని చర్యలూ తీసుకొన్నామన్నారు. ఈ ప్రావిన్స్ నుంచి ఇప్పటికే 4,000 మందిని తరలించారు. 6,69,000 ఎకరాల్లో ఇది వ్యాపించింది. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని.. రానురాను సంక్లిష్టంగా మారే అవకాశముందని సిబ్బంది చెబుతున్నారు.
ఇక బుధవారం మాంటోబా ప్రావిన్స్లో అత్యవసర పరిస్థితి విధించారు. చిన్నచిన్న ఊళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు అంటున్నారు. ప్రజలను తరలించేందుకు కెనడా వైమానిక దళం రంగంలోకి దిగింది. ఈ ప్రావిన్స్లో 1,73,000 ఎకరాలు కాలి బూడిదయ్యాయి. రెండు లేదా మూడు రోజలు వర్షం పడితేగానీ ఈ కార్చిచ్చు అదుపులోకి రాదని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు