చండీగఢ్ 1 జూన్ (హి.స.), శ్రీనగర్, జైపుర్: పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శనివారం ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, చండీగఢ్లలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఈ డ్రిల్ జరిగింది. యుద్ధ సమయంలో సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను తెలుసుకునేందుకు దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ డ్రిల్ను మే 29న నిర్వహించాలని నిర్ణయించారు. దానిని కేంద్ర హోంశాఖ శనివారానికి మార్చింది. ఇదే తరహా మాక్ డ్రిల్ను మే 7వ తేదీన ప్రభుత్వం.. దేశమంతా నిర్వహించింది.
పంజాబ్, హరియాణాల్లోని అన్ని జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ జరిగింది. వాలంటీర్లు గాయపడటం, వారిని స్ట్రెచర్లపై తరలించడం, అంబులెన్సులు రావడం, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పివేయడం వంటివి అందులో చేశారు.
మాక్ డ్రిల్లో.. అగ్నిమాపక, పోలీసు, ఆరోగ్య, విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ పాల్గొన్నాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వాలంటీర్లు, హోంగార్డులు 10,000 మంది ఇందులో పాల్గొనడం విశేషం. సాయంత్రం 6 గంటల సమయంలో ఫజిల్కాలో సైరన్ మోగించి డ్రిల్కు శ్రీకారం చుట్టారు.
రాత్రి 8 గంటల సమయంలో బ్లాకౌట్ ప్రారంభమైంది. ఆయా నగరాల్లో 10 నిమిషాల నుంచి అరగంట వరకూ సాగింది. పంజాబ్ సరిహద్దులోని ఫజిల్కాలో రాత్రి 9 గంటల సమయంలో అరగంటపాటు బ్లాకౌట్ జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు