అమరావతి, 10 జూన్ (హి.స.), వందేభారత్ ఎక్స్ప్రె్సపై రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఒంగోలు-సూరారెడ్డిపాలెం స్టేషన్ల మధ్యలో వందేభారత్ రైలుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో సీ-5, 8, 11 బోగీల అద్దాలు పగిలాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు... రైలులో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా... ఒంగోలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న గంగవరపు రిషీంద్రబాబు, ఎస్కే ఖాదర్ బాషా, ఎస్కే ఆదిష్ కరిమూల్లా ఈ పనిచేసినట్టు గుర్తించారు. ఈ నెల 5న ఈ ముగ్గురూ రైల్వేట్రాక్ సమీపంలో బీరు తాగారు. ముందుగా కోర్బా-త్రివేండ్రం ఎక్స్ప్రె్సపై రాళ్లు విసిరారు. అయితే అవి రైలు వరకు వెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన వందేభారత్పైనా రాళ్లు విసరడంతో మూడు బోగీల కిటికీ అద్దాలు పగిలాయి. విచారణ అనంతరం ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ