తిరుమల , 10 జూన్ (హి.స.)కలియుగంలోని పవ్రిత పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) గత మూడు వారాల నుంచి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది.
మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుపతి (Tirupati) కొండపై రద్దీ వాతావరణం నెలకొంది.
మంగళవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. కాగా సోమవారం కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో.. నిన్న స్వామివారిని 84,258 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 33,502 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీల ద్వారా టీటీడీకి రూ.3.90 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి