హైదరాబాద్, 14 జూన్ (హి.స.)
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సంబంధించిన కొత్త తేదీ ఖరారైంది. సాంకేతిక సమస్యలతో ఈ రోదసియాత్ర పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త తేదీని ప్రకటించింది.
యాక్సియం-4 కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు జూన్ 19న రోదసియాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈనెల 11న ప్రయోగానికి ముందు రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో వెల్లడించింది. ఈనేపథ్యంలో కొత్త ప్రయోగ తేదీని ప్రకటించింది.
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు