దిల్లీ: 14 జూన్ (హి.స.) కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి ఎదుర్కొంటున్న అక్రమ మైనింగ్ కేసుపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునేంత వరకూ ఆయన్ను భాజపా నుంచి సస్పెండ్ చేయాలని.. ‘గాలి’ మైనింగ్ దందాపై న్యాయపోరాటం చేస్తున్న సోదరులు తపాల్ గణేష్, ఏకాంబరంలు ఆ పార్టీ నాయకత్వాన్ని కోరారు.
ఈ మేరకు వారు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు లేఖ రాశారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 191, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్కు పాల్పడినా, సహజ వనరుల స్వరూపాన్ని దెబ్బతీసే అవినీతి కార్యకలాపాల్లో భాగస్వామి అయిన వారి చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. అక్రమ మైనింగ్లాంటి కార్యకలాపాలు ప్రజావిశ్వాసం, ప్రజాస్వామ్య బాధ్యతల ఉల్లంఘన కిందికి వస్తుంది. అది సదరు సభ్యుల చట్టసభ సభ్యత్వ రద్దుకు దారితీస్తుంది. గాలి జనార్దన్రెడ్డి, అతని అనుచర బృందానికి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మేం తప్పుబట్టడంలేదు. ఆ కేసు సుప్రీంకు వెళ్లి, దానిపై తుది తీర్పు వెలువరించేంత వరకూ గాలి జనార్దన్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కుట్ర, మోసం, విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన నేరాలు సీబీఐ కోర్టులో నిరూపితమయ్యాయి. బెయిల్తో బయటికొచ్చిన ఆయన ఇప్పటికీ అబద్ధాలు చెప్పడం మానడం లేదు. అందువల్ల ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని భాజపా పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు