హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10గంటల సమయంలో అడ్వకేట్ రామచందర్రావుతో కలిసి ఆయన హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఈకేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లుతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఆయన ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్