దిల్లీ: 19 జూన్ (హి.స.)బలవంతపు బాల్య వివాహాన్ని రద్దు చేయాలని కోరుతున్న బాలికకు రక్షణ కల్పించాలని బిహార్ డీజీపీ, దిల్లీ పోలీస్ కమిషనర్ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని బాలిక, ఆమె స్నేహితురాలు భయపడుతున్నందున అధికారులు వారికి అందుబాటులో ఉంటూ తగిన సహాయ సహకారాలు అందించాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తెలిపింది. గత ఏడాది డిసెంబరు 9న తనకు బలవంతపు వివాహం చేశారని, అప్పటికి తన వయసు పదహారున్నర సంవత్సరాలేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్లో బాలిక పేర్కొంది. అప్పటికి పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని తెలిపారు. చదువు కొనసాగించటానికి అత్తింటి వారు తొలుత అంగీకరించినప్పటికీ ఆ తర్వాత సహకరించలేదని, బిడ్డను కనాలని బలవంతం పెట్టారని ఆరోపించారు. పెళ్లికి భారీగా డబ్బు ఖర్చయ్యిందని చెబుతూ కాపురం చేయాల్సిందేనంటూ భర్త, అత్తమామలు భయపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ