
అమరావతి, 2 జూన్ (హి.స.)జమ్మూ రైల్వే డివిజన్ ఏర్పాటుకు డీపీఆర్ రెడీ కావటంతో పాటు ఏకంగా పరిపాలనను ప్రారంభిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం...విశాఖ రైల్వేజోన్ విషయంలో ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోతోందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు సీహెచ్ శంకర్రావు ప్రశ్నించారు.
విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో రీ-ఆర్గనైజేషన్ యాక్ట్లో ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపై రిపోర్టు ఇవ్వటానికి పార్లమెంట్లో ఆమోదం లభించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత డీపీఆర్ కూడా ఆమోదం పొందిందని, ఇప్పటికి పదేళ్లు గడిచినా జోన్ ఏర్పాటు కాలేదన్నారు. 2025-జనవరిలో ప్రకటించిన జమ్మూ రైల్వే డివిజన్కు 6 నెలల్లోపే డీపీఆర్ తయారు చేయించారని, వెంటనే ఆమోదం కూడా పొందిందన్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటంతో పాటు జూన్ 1 నుంచి పరిపాలన కూడా ప్రారంభమైందన్నారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్పై ఎందుకు కేంద్ర ప్రభుత్వం సవతిప్రేమ చూపిస్తోందని ప్రశ్నించారు. భూమి ఇవ్వలేదన్న పేరుతో కొన్నేళ్లుగా కాలయాపన చేశారని, . చంద్రబాబు అధికారంలోకి రాగానే భూములను అప్పగించి కొత్త భవనాల శంకుస్థాపనకు చర్యలు చేపట్టార ని, కేంద్రం ఎందుకు జీవో ఇవ్వట్లేదని నిలదీశారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు విశాఖ రైల్వేజోన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధానితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా జీవో ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ