విశాఖపట్నం 20 జూన్ (హి.స.),రాష్ట్రంలో గడచిన వారం, పది రోజుల నుంచి వర్షాలు తగ్గాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ తర్వాత మందగించాయి. నాలుగు రోజుల క్రితం మరోసారి చురుగ్గా మారి తూర్పు భారతం వైపు పయనించినా రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవలేదు. రుతుపవనాల్లో మందగమనం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. గురువారం జంగమహేశ్వరపురంలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఎండ తీవ్రత ఉంటుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 48.7 మి.మీ.కుగాను 34.4 మి.మీ. వర్షపాతం(సాధారణం కంటే 29 శాతం తక్కువ) నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ