అమరావతి, 23 జూన్ (హి.స.)
, హైదరాబాద్: రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకోనివారి వివరాలను అధికార యంత్రాంగం పరిశీలించింది. ఈ మేరకు లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులుగా లెక్క తేలింది. ఈ వివరాలను పౌర సరఫరాలశాఖ జిల్లాలవారీగా కలెక్టర్లకు పంపించింది. కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ఇకనుంచి వారికి రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకోనివారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పౌర సరఫరాలశాఖ ఈ వివరాల్ని జిల్లా కలెక్టర్లకు పంపించి మండలస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా విచారణ జరిపించింది. ఇందులో అర్హులు, అనర్హులను గుర్తించి ఆ వివరాల్ని పౌరసరఫరాలశాఖకు పంపించగా, రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ