అమరావతి, 23 జూన్ (హి.స.)
, :అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో.. వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం జరుగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడచినందున జూన్ 12వ తేదీనే ఈ భేటీ నిర్వహించాలని భావించినా.. అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. సోమవారం నాటి ప్రత్యేక సమావేశంలో.. గడచిన ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెడతారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ