హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి
అమ్మవారి బోనాల జాతర విజయవంతం అయ్యేందుకు అందరి సహకారం అవసరమని రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినా స్థానికులు, భక్తుల సహకారం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. జూలై 13, 14వ తేదీల్లో జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను దేవాలయ ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపడుతున్నా ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. బోనాల జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని ఆతిథ్యం ఇవ్వడంలో నగర ప్రజలు ముందుంటారనే నానుడి ఉందని అలాగే ఈ సారి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మన ఆతిథ్యాన్ని చూపించాలన్నారు. ఉదయం నుంచి ఉపవాసాలతో మహిళలు బోనాలు తల పై పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వస్తారని భక్తులు, వీఐపీలు కూడా వారు ముందుగా దర్శనం చేసుకునేలా సహకరించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్