హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించిన ‘రైతు భరోసా’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ‘రైతు భరోసా’ విజయోత్సవ సభ’లను ప్లాన్ చేస్తోందని, అయితే విజయోత్సవాలు కాదని, రైతులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ‘రైతు భరోసా’ పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు.19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.12 వేలకే పరిమితం చేయడం మోసం చేయడమేనని అన్నారు. గత వానకాలం ‘రైతు భరోసా’ ఎగ్గొట్టి, యాసంగిలోనూ ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేని ఆక్షేపించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..