అనంతపురంలో 24 గంటల వ్యవధిలో మరో దారుణ హత్య
అనంతపురం , 25 జూన్ (హి.స.)అనంతపురం జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం నగర శివారులో ఒక యువకుడి దారుణ హత్య ఘటన మరువక ముందే, నేడు మరో వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అనంతపురం రూరల్ మండలం, అక్కంపల్
అనంతపురంలో 24 గంటల వ్యవధిలో మరో దారుణ హత్య


అనంతపురం , 25 జూన్ (హి.స.)అనంతపురం జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం నగర శివారులో ఒక యువకుడి దారుణ హత్య ఘటన మరువక ముందే, నేడు మరో వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.

అనంతపురం రూరల్ మండలం, అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేష్ తలపై బండరాయితో అత్యంత పాశవికంగా మోది హత్య చేశారు. కంబదూరు ప్రాంతానికి చెందిన సురేష్, గత ఆరేళ్లుగా అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద గల సదాశివ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి సమీపంలో ఒక హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, సురేష్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో హోటల్ వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని దుండగులు అతడిని అడ్డగించి, తలపై బండరాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సురేష్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి.

ఈ హత్య ఘటనపై సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు, హంతకుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, నిన్న అనంతపురం నగర శివారులోని బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే మరో హత్య జరగడం జిల్లాలో తీవ్ర భయాందోళనలకు దారితీస్తోంది. వరుస ఘటనలతో ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ హత్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande