
హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లకు కచ్చితంగా శిక్ష పడాలని, వారిద్దరూ జైలుకు వెళ్లాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు.ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విశ్వేశ్వర్రెడ్డిని ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గతంలో ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. “గతంలో నా ఫోన్ చాలాసార్లు ట్యాప్ అయింది. దీనిపై నేను అప్పుడే ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరగాలి” అని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్