జూరాల , 29 జూన్ (హి.స.)
: ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.200 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దీనివల్ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ప్రవాహం గణనీయంగా పెరిగింది.
ఇటీవల డ్యామ్కు సంబంధించిన 9వ గేట్ రోప్ తెగిపోయిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దీంతో పాటు మరో రెండు గేట్ల రోప్లు బలహీనంగా ఉండటంతో ఆయకట్టు రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అధికారులు స్పందిస్తూ.. ఎలాంటి ప్రమాదం లేదని, అవసరమైన ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోప్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ