హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
: అవినీతి వ్యవహారాలతో తరచుగా వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మరో వివాదంలో చిక్కుకుంది. ఆదివారం సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగబోతుండగా.. హడావుడిగా 136 క్లబ్లకు ఒక్కో దానికి రూ.3 లక్షల చొప్పున రూ.4 కోట్ల రూపాయల మొత్తాన్ని పంచడం చర్చనీయాంశంగా మారింది. క్లబ్ల అభివృద్ధి కోసం ఈ నిధులను ఇచ్చినట్లు హెచ్సీఏ పెద్దలు చెబుతున్నప్పటికీ.. చెల్లింపులు జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఏజీఎంలో క్లబ్ల నుంచి వ్యతిరేక గళాలు వినిపించకుండా చూడడంతో పాటు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసమే ఈ చెల్లింపులు చేశారని.. దీని వెనుక హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావుతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు ఉన్నారని.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని తెలంగాణ అవినీతి నిరోధక విభాగం అధికారులకు ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. హెచ్సీఏలో ఏ చెల్లింపులు చేయాలన్నా కార్యదర్శి ఆమోదం తప్పనిసరి. కానీ కార్యదర్శి దేవరాజ్ అందుబాటులో లేకపోయినా, ఆయన సంతకం లేకుండానే చెల్లింపులు పూర్తయ్యాయి. గురువారం అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. దానికి కార్యదర్శి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నారు. ఆ సమావేశంలో మిగతా ఆఫీస్ బేరర్ల ఆమోదంతో ఒక్క రోజులో క్లబ్లకు రూ.4 కోట్ల రూపాయలు పంచేశారు. ఇంత హడావుడిగా, నిబంధనలకు విరుద్ధంగా క్లబ్లకు నిధులను పంచడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ