తిరుమల, , 29 జూన్ (హి.స.)
: తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించాలని తితిదే ఉన్నతాధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనార్థం రోజూ సుమారు 70వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. 2 ఘాట్రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతిచెందిన వారికి తితిదే రూ.3లక్షల వరకు చెల్లిస్తోంది. ఇప్పుడు అలిపిరి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునేవరకు వారికి బీమాను కల్పించాలని చూస్తున్నారు. భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ