హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతలు వదిలి.. శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పక్క రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అన్నీ పార్టీలు కలిసి వస్తాయన్నారు. తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ గాంధీభవన్లో మంత్రి పొన్నం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారని, బాధ్యతారహితంగా వ్యహరించినందుకు మీకు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారని విమర్శించారు. రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు కనుమరుగు చేస్తారని విమర్శలు గుప్పించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్