, హైదరాబాద్,, 29 జూన్ (హి.స.)
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీకి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇటీవల కొండా మురళీపై కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వడానికి ఆయన శనివారం గాంధీభవన్కు వచ్చి కమిటీ ఛైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యాంమోహన్, కమలాకర్రావు, నిరంజన్రెడ్డిలను కలిసి వివరణ ఇచ్చారు. దీనికి స్పందించిన కమిటీ వారంలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించింది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదుల వివరాలను మురళీకి తెలుపగా ఆయన మౌఖికంగా వివరణ ఇచ్చారని తెలిపారు.
మురళీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, కొందరిపై తాను చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దని కమిటీకి చెప్పినట్లు వివరించారు. తననెవరు గాంధీభవన్కు పిలవలేదని పార్టీ మీద గౌరవంతోనే వచ్చి వివరణ ఇచ్చానని చెప్పారు. కాగా క్రమశిక్షణ కమిటీకి మురళీ ఆరు పేజీల లేఖ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలను అందులో ప్రస్తావించి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. మురళీకి మద్దతుగా ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో గాంధీభవన్కు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ