అమరావతి, 29 జూన్ (హి.స.)
సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన వైకుంఠ వాసుల మెట్టపై వరద పాయసం ఉత్సవం వైభవంగా జరిగింది. వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్న స్వామి ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న కొండ శిఖరంపై కొలువైన వైకుంఠ నారాయణుడికి అర్చకులు విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. అక్కడే పాయసం వండి స్వామికి నివేదించారు. అనంతరం పాయసాన్ని ఆలయం వెనుక వైపు ఉన్న పొర్లుబండ పైనుంచి ఒలకబోశారు. భక్తులు ఈ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఏటా సింహగిరిపై సువృష్టి వర్షాలు కురవాలన్న సంకల్పంతో వైకుంఠవాసుడికి అభిషేకాలు, విరాటపర్వం పారాయణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ