అమరావతి, 3 జూన్ (హి.స.) గుంటూరు నగరంలో సోమవారం రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే విజయలక్ష్మీ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు తెనాలి, ఉండవల్లి ప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా గుంటూరు నగర పరిధిలో కేసులు వెలుగుచూశాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యచికిత్స అందిస్తున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ సమీపంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. రోజుకి కనీసం వంద మందికి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. కరోనా రోగులకు చికిత్స నిమిత్తం బీ క్లాస్ వార్డులో 15 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్ను కూడా సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ