అమరావతి, 3 జూన్ (హి.స.)ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమవుతున్న ఉర్సా భూముల వ్యవహారంపై పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. అనేక అంశాల్లో అవినీతి జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్.. భూముల కేటాయింపు అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉర్సా కంపెనీకి భూములు కేటాయించడాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. విశాఖ లాంటి నగరంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ.. రూపాయికి మూడు వేల కోట్ల రూపాయిల భూములు ఇస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీ వేల కోట్ల భూములు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
లేటెస్ట్గా జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఉర్సా కంపెనీకి తక్కువ రేటుకు భూములు ఇచ్చినట్టు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెబితే చాలన్నారు.
ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్కు కొత్తేమీ కాదన్నారు. ఇక ఉర్సా కంపెనీకి ఏ ధరకు ప్రభుత్వం భూములు కేటాయించిందనే విషయాలను కూడా వివరించారు లోకేష్. విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని స్పష్టం చేశారు. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి