అమరావతి, 3 జూన్ (హి.స.)రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఖర్చు తక్కువగా ఉండటం, ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు ఇస్తుండటం, ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుండటంతో ఈవీల కొనుగోలుపై ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. 2019-20లో రాష్ట్రంలో విద్యుత్ ద్విచక్రవాహనాల సంఖ్య 1,042 మాత్రమే ఉండేది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు వీటి సంఖ్య 1.03 లక్షలు దాటిందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇదే సమయంలో విద్యుత్ కార్ల సంఖ్య 72 నుంచి 6 వేలకు పెరిగింది. అయితే ఈవీల ఛార్జింగ్కు ఛార్జింగ్ స్టేషన్లలో ధరలు ఎక్కువగా ఉండటం భారంగా ఉంటోంది.
గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలో పరిమితంగా కొన్నిచోట్ల మాత్రమే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు ఆ మార్గంతోపాటు విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు, అటు నెల్లూరు, చెన్నై, తిరుపతి వైపు హైవేల వెంట పెద్ద సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ నగర పరిధిలోనే దాదాపు 20కి పైగా ఉన్నాయి. ఔత్సాహిక సంస్థలు పెట్రోల్ బంకులు, హోటళ్లు, రిఫ్రెష్మెంట్ సెంటర్ల వద్ద వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రకాల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు కలిపి 880 ఉన్నట్లు విద్యుత్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి