విశాఖ: 3 జూన్ (హి.స. ) గత నెల్లో నమోదైన కొవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పుణెలోని ఎన్ఐవీలో పరీక్షించగా ఒమిక్రాన్ (బీఎ.2 మాదిరి) వేరియంట్గా తేలింది. విశాఖ కేజీహెచ్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. చాలా వరకు రికార్డుల్లో నమోదవడం లేదు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రోజుకు వెయ్యి వరకు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. పాత జీజీహెచ్ల్లో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్ల్లో రోజుకు 50 చొప్పున పరీక్షలకు కిట్లు ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సోమవారం ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ విడిగా రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల తీరు, అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు, కిట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ