తిరుపతి, 3 జూన్ (హి.స.)హైదరాబాద్లోని కూకట్పల్లిలో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇందులో ఏపీలోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వీరు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఆరుగురిలో ఉన్న ఓ కానిస్టేబుల్ వద్ద నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ అధికారులు తెలిపారు.
కాగా పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్కు చెందిన ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లాకు చెందిన దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన చెగుడు మెర్సీ మార్గరెట్(34), షేక్ మస్తాన్ వలీ(40), దేవరాజు యేసుబాబు(29) ఉన్నారు. వీరంతా కలిసి గత కొద్ది రోజులుగా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి