తెలంగాణ, సంగారెడ్డి. 30 జూన్ (హి.స.) పేలుడులో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం తో పాటు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజీ ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎప్పుడు కూడా కార్మికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు