అమరావతి, 30 జూన్ (హి.స.)నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నిన్న నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) కౌంటర్ ఇచ్చారు.
నక్సలైట్లను చంపగలరు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని నారాయణ అన్నారు.
వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా నిన్న నిజామాబాద్ జిల్లా పర్యటలో భాగంగా మాట్లాడిన అమిత్ షా నక్సలైట్లు తక్షణమే హింసను వీడి లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
నక్సలైట్లు గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు కానీ.. ఇప్పుడు చర్చల కోసం చాలా మంది పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారన్నారు. ఆయుధాలు వీడే దాక వారితో చర్చలు ఉండవని అమిత్ షా స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి