
శ్రీనగర్, 8 జూన్ (హి.స.)అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) 2025కు ఇప్పటివరకు 3,31,000 మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ యాత్ర జూలై 3, 2025 నుంచి అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గండర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ప్రారంభమై.. ఆగస్టు 9, 2025న రక్షా బంధన్ పండుగతో ముగుస్తుంది. ఈ విషయాన్ని రాజ్ భవన్లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్నాథ్ జీ ష్రైన్ బోర్డు (SASB) 49వ సమావేశంలో వెల్లడించారు.
సమావేశంలో యాత్ర సన్నాహాలు, బేస్ క్యాంపులు, మార్గాల్లో అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లను ఎల్జీ సమీక్షించారు. ష్రైన్ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంబంధిత శాఖల సన్నాహాలను బోర్డు విస్తృతంగా సమీక్షించి, భక్తుల కోసం సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు పలు చర్యలను ప్రతిపాదించింది.
“పలు కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఎల్జీ సమీక్షించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.” అని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. “భక్తుల భద్రత, శ్రేయస్సు మా అత్యంత ప్రాధాన్యత. అందరికీ సౌకర్యవంతమైన, ఆధ్యాత్మికంగా సంతృప్తికరమైన అనుభవాన్ని అందించేందుకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని సిన్హా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి