హైదరాబాద్, 8 జూన్ (హి.స.)
డిజిటల్ మోసాలను అరికట్టేందుకు, సంయుక్తంగా పోరాడేందుకు కలిసి పని చేయాలని కోరుతూ ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కీలక ముందడుగు వేసింది. దీనికోసం ఎయిర్టెల్ 40కి పైగా బ్యాంకులతో పాటు ఆర్బీఐ, ఎన్పీసీఐలకు లేఖ రాసింది. అందరూ కలిసి మోసపూరిత ఆన్లైన్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుందామని సూచించింది. హానికరమైన, మోసపూరిత సైట్లను ముందుగానే గుర్తించి నియంత్రించేందుకు, డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు మల్టీ-లేయర్ డిఫెన్సివ్ సిస్టమ్ను నిర్మించేందుకు సహకారం కావాలని ఆర్బీఐ, ఎన్పీసీఐకి రాసిన లేఖలో ఎయిర్టెల్ కోరింది. అదేవిధంగా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులకు కూడా ఇలాంటి ప్రతిపాదనలే పంపింది. ఓటీటీ ప్లాట్ఫామ్లను కస్టమర్ల భద్రతకు జవాబుదారీగా ఉంచే ఫ్రేమ్ వర్క్ నిర్మించాలనే ఆర్బీఐ ఆలోచనకు మద్దతిచ్చింది. డిజిటల్ మోసాల్లో వస్తున్న కొత్త విధానాలు, సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచేందుకు జాయింట్ పబ్లిక్ క్యాంపెయిన్ నిర్వహించాలని ప్రతిపాదించింది. దేశ డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భాగస్వామ్యం అవసరమని ఎన్పీసీఐకి రాసిన ప్రత్యేక లేఖలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్