పెరంబూరు 9 జూన్ (హి.స.) : భారతీయ రైల్వే త్వరలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఛెయిర్ కార్స్ (కూర్చునే) బోగీల ఉత్పత్తి నిలిపేసి స్లీపర్ కోచ్లు తయారు చేయడానికి ప్రణాళికలు చేస్తోంది. మరో 11 వందేభారత్ రైళ్లు ఛెయిర్ కార్తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్ కోచ్ ప్యాక్టరీ(ఐసీఎఫ్) అధికారి ఒకరన్నారు. ఆ తర్వాత ఛెయిర్ కార్ బోగీల ఉత్పత్తులు ఆపేసి స్లీపర్ కోచ్లపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్), పెరంబూరులోని ‘ఐసీఎఫ్’లో వందేభారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ఉత్పత్తి పూర్తయిందని, ప్రొటోటైప్తో కూడిన రైలును రైల్వే బోర్డుకు త్వరలో అందించనున్నామని, రైల్వే బోర్డు 97 వందే భారత్ రైళ్ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని ఐసీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో 86 రైళ్లు తయారీ పూర్తయి డెలివరీ కూడా చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మిగిలిన 11 ఛెయిర్ కార్ బోగీలను బోర్డుకి అందిస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ