ఢిల్లీ, 14 జూలై (హి.స.)
భారత వ్యోమగామి అంతరిక్ష యాత్ర ముగిసింది. మరికొన్ని గంటల్లోనే శుభాంశు శుక్లా భూమిపైకి చేరుకోనున్నారు. 18రోజుల పాటు ప్రయోగాల తర్వాత తిరిగి భూమ్మీదకు రాబోతున్నారు నలుగురు వ్యోమగాములు. తన అంతరిక్ష యాత్రను ఓ అద్భుతమైన ప్రయాణం అన్నారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే.. గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోందన్నారు. ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ అంతరిక్ష యాత్రకు సెండాఫ్ ఇచ్చాడు. ఇవాళ ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి, రేపు భూమిపైకి చేరుకోబోతున్నారు.
శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోజ్ ఉజ్నాన్స్కీ– విస్నివ్స్కీ, టిబోర్ కపు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి వేరుపడతారు. ఆ తర్వాత.. క్రూ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో భూమి దిశగా ప్రయాణం సాగిస్తారని నాసా ప్రకటించింది. రేపు సాయంత్రం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో భూమిపై అడుగు పెడతారని తెలిపింది. శుభాంశు శుక్లాతోపాటు ఇతర వ్యోమగాములు భూమికిపైకి తిరిగివచ్చిన తర్వాత వారం రోజులపాటు క్వారంటైన్లో ఉంటారు. సైంటిస్టులు వారికి పరీక్షలు నిర్వహిస్తారు. భూ వాతావరణానికి పూర్తిస్థాయిలో అలవాటు పడిన తర్వాత వ్యోమగాములు బాహ్య ప్రపంచంలోకి వస్తారు.
స్పేస్ఎక్స్ యాగ్జియం–4 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు గత నెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 18 రోజుల తర్వాత.. ‘ఐఎస్ఎస్’లో నేడు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శుభాంశు మాట్లాడుతూ.. ఇదొక అద్భుత ప్రయాణమని చెప్పారు. ఇదంతా మాయగా అనిపిస్తోందన్నారు. ‘ఐఎస్ఎస్’ నుంచి ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని.. వాటిని తన దేశ ప్రజలతో పంచుకుంటానని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి