దిల్లీ16 జూలై (హి.స.)భారత్ తన రక్షణ సామర్థ్యాలను తక్షణం మెరుగుపరుచుకోవాల్సి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్ (Anil Chauhan) స్పష్టం చేశారు. రేపటి టెక్నాలజీని వినియోగించి ఇవాళ యుద్ధరంగంలో పోరాడాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. అలాంటి సమయంలో నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధం చేసి జయించలేమని వ్యాఖ్యానించారు. బుధవారం దిల్లీలో జరిగిన ఒక వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘మన వ్యూహాత్మక మిషన్లకు కీలకమైన సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. దిగుమతి చేసుకున్న టెక్నాలజీపై ఆధారపడటం వల్ల మన సంసిద్ధత దెబ్బతింటుంది’’ అని స్వదేశీ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను చౌహాన్ (Anil Chauhan) మరోసారి గుర్తుచేశారు. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఆయుధాలను సమర్థమంతంగా నిర్వీర్యం చేశామని, వాటివల్ల భారత సైన్యం, పౌరులకు చెందిన మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు