ఢిల్లీ, 22 జూలై (హి.స.)
శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై మంగళవారం సుప్రీంకోర్టు (Supreme court)లో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని ఈసందర్భంగా వ్యాఖ్యానించింది.
శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని 14 కీలక ప్రశ్నలను అత్యన్నత న్యాయస్థానం ముందుంచారు.
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు