అమరావతి, 26 జూలై (హి.స.)పవర్స్టార్ పవన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ నెల 24 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ మొదలు కాగా, ఆయన మధ్యలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ చిత్రాన్ని పూర్తి చేశారు. గత ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకి విడుదలైంది. అయితే, తాజాగా క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు త్వరలోనే తెలుస్తాయని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలో వెళ్లిపోవడానికి సంబంధించిన అసలు కారణాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయి అంటూ క్రిష్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తనకు పవన్ తో ఎలాంటి విభేదాలు లేవని, మా మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లు కూడా లేవంటూ ఆయన స్పష్టం చేసినట్టు మీడియా సంస్థ పేర్కొంది. తాను ఓపెన్గా ఉన్నానని, భవిష్యత్తులో పవన్ తో మళ్లీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఇక, ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు కూడా క్రిష్ సోషల్ మీడియా వేదికగా పవన్, ఏఎం రత్నంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తవ్వడానికి పవన్ కల్యాణ్ గారు, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారు ప్రధాన కారణాలు అని పేర్కొంటూ ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
అటు, చిత్ర ప్రమోషన్స్ సమయంలో పవన్.. క్రిష్పై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ స్క్రిప్ట్ వినగానే ఇది సాధారణ కథ కాదని అర్థమైంది. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా వచ్చింది.. ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా సాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ మంచి కాన్సెప్ట్తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి అని మెచ్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి